హైదరాబాద్ నగరంలో జరిగిన భారత్ జోడో యాత్రలో తోసుకోవడంతో కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి నితిన్ రౌత్ గాయపడ్డారు. హైదరాబాద్లోని వాసవి ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం రాహుల్తో కలిసి నడుస్తుండగా తోపులాట జరిగింది. కార్యకర్తలు రాహుల్ను కలిసేందుకు ఒక్కసారిగా దూసుకొని వచ్చారు. దీంతో రౌత్ కంటికి గాయమైంది. వెంటనే అతన్ని హైదరాబాద్లోని వాసవి ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనలో మాజీ మంత్రి కుడి కన్ను, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
హైదరాబాద్లో వరుసగా రెండో రోజు పాదయాత్ర కొనసాగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్ర బుధవారం సాయంత్రం BHEL బస్టాండ్ నుండి తిరిగి ప్రారంభమవుతుంది. కార్నర్ మీటింగ్తో ముత్తంగిలో ఆగుతుంది. జోడో యాత్ర దృష్ట్యా మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్ పరిధిలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
నవంబర్ 4న ఒక్కరోజు విరామంతో నవంబర్ 7వ తేదీ వరకు తెలంగాణలో పాదయాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలో 19 అసెంబ్లీ, 7 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తం 375 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది.