వాహనదారులకు అలర్ట్ : మార్చి 1 నుంచి హైదరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ నగరంలో మార్చి 1 నుంచి ట్రాఫిక్ పోలీసులు భారీ ఎత్తున 'స్పెషల్ డ్రైవ్' నిర్వహించనున్నారు. ముఖ్యంగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు సాగనున్నాయి

Published By: HashtagU Telugu Desk
Hyderabad Traffic Alert

Hyderabad Traffic Alert

Traffic Alert : హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడమే లక్ష్యంగా వచ్చే నెల నుంచి ఈ పర్తేయ్కయా డ్రైవ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ నగరంలో మార్చి 1 నుంచి ట్రాఫిక్ పోలీసులు భారీ ఎత్తున ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించనున్నారు. ముఖ్యంగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు సాగనున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం లైసెన్స్ లేని, శిక్షణ లేని డ్రైవర్ల వల్లే జరుగుతున్నాయని పోలీసుల విశ్లేషణలో తేలింది. అందుకే, వాహనదారులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ లైసెన్స్‌ను వెంట ఉంచుకోవాలని, లేనిపక్షంలో వెంటనే ఆర్టీఏ కార్యాలయం ద్వారా పొందాలని సూచిస్తున్నారు. ఒకవేళ లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడిపి ప్రమాదం జరిగితే, సదరు వాహనానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా వర్తించదని, దీనివల్ల యజమాని భారీ ఆర్థిక చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ నిబంధనలు కేవలం వాహనం నడిపేవారికే కాకుండా, వాహన యజమానులకు కూడా వర్తిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లకు లేదా ఇతర వ్యక్తులకు తమ వాహనాలను అప్పగించడం చట్టరీత్యా నేరం. అలా ఇచ్చినట్లు గుర్తిస్తే, వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తారు. వాహనం ఇచ్చే ముందు సదరు వ్యక్తికి లైసెన్స్ ఉందో లేదో తనిఖీ చేసుకోవడం యజమాని కనీస బాధ్యత అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష వరకు వెళ్లే అవకాశం ఉంటుందని పోలీసు యంత్రాంగం తేల్చి చెప్పింది.

పెండింగ్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు నంబర్ ప్లేట్లను మాస్కులతో కప్పడం, అంకెలను మార్చడం లేదా రంగు పూయడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, ఇది క్రిమినల్ నేరం కిందకు వస్తుందని పోలీసులు హెచ్చరించారు. అటువంటి వాహనాలను గుర్తించేందుకు నగరవ్యాప్తంగా సీసీటీవీ నెట్‌వర్క్‌ను మరియు అత్యాధునిక ఏఐ (AI) కెమెరాలను వాడుతున్నారు. పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడమే కాకుండా, సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు వెనుకాడబోమని ట్రాఫిక్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

  Last Updated: 11 Feb 2026, 11:55 AM IST