Migrations to Hyderabad : వాతావరణ మార్పులపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిలో వచ్చే మార్పులు, వాతావరణ వైపరీత్యాల వల్ల రాబోయే 20 ఏళ్లలో దేశంలోని చాలా నగరాలు, పట్టణాలు నివాసయోగ్యతను కోల్పోతాయని ఆయన జోస్యం చెప్పారు. అలాంటి ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో.. నివాస యోగ్య ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈక్రమంలో హైదరాబాద్ (తెలంగాణ), బెంగళూరు (కర్ణాటక), పూణే (మహారాష్ట్ర) నగరాలకు భారీగా జనాభా వలసలు జరిగే అవకాశం ఉందని నారాయణ మూర్తి అంచనావేశారు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Students Threat Emails : ఆ స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపింది విద్యార్థులే!
‘‘రాబోయే 20 ఏళ్లలో భారీగా జనాభా వలసలు జరిగితే.. హైదరాబాద్, బెంగళూరు, పూణే నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. అక్కడ కాలుష్యం మరింత పెరుగుతుంది. దీంతో అక్కడ జనజీవనం మరింత దుర్భరంగా తయారవుతుంది. ఆ పరిస్థితి రాకూడదు అంటే.. ఇప్పుడే మేల్కొనాలి. వాతావరణ మార్పులతో దేశంలో నివాస యోగ్యతను కోల్పోయే ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాలను పరిరక్షించుకోవాలి’’ అని నారాయణ మూర్తి సూచించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కార్పొరేట్ రంగానికి, రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు ప్రజలు సహకరించాలన్నారు. అందరూ కలిసికట్టుగా, పరస్పర విశ్వాసంతో ముందుకు సాగితేనే భవిష్యత్తులో దేశంలోని ప్రధాన నగరాలకు భారీ వలసలు జరగకుండా అడ్డుకట్ట వేయగలమన్నారు.
Also Read :National Mathematics Day : ‘గణిత దినోత్సవం’.. స్ఫూర్తిప్రదాత శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలు
భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలంటే.. యువత తప్పకుండా ప్రతీవారం 70 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వారానికి 70 గంటలు పనిచేయడాన్ని భారంగా భావించకూడదని యువతకు నారాయణ మూర్తి సూచించారు. దేశాన్ని పురోగతి బాటలో తీసుకెళ్లాలంటే.. యువతకు అన్ని రంగాల్లోనూ ప్రోత్సాహం దక్కాలన్నారు. కాలుష్యాన్ని తగ్గించుకుంటూ, జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను పెంచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని నారాయణమూర్తి(Migrations to Hyderabad) అభిప్రాయపడ్డారు.