హైదరాబాద్ చైతన్యపురిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తుంది. మహ్మద్ ఇమ్రాన్ అనే యువకుడిని ఆరుగురు వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చి బూడిదను మూసీ నదిలో విసిరారు. మహ్మద్ ఇమ్రాన్ బ్యాగుల తయారీ కంపెనీలో పని చేస్తూ సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 5న, ఇమ్రాన్ తన స్నేహితుడు సూను సింగ్ను కలవడానికి బయటకు వెళ్లాడు. ప్రమాదంలో దెబ్బతిన్న ఇమ్రాన్ మోటార్సైకిల్ మరమ్మతు గురించి చర్చించడానికి ఆ వ్యక్తి అతన్ని పిలిచాడు . ఆ తరువాత ఇమ్రాన్ కనిపిచకపోవడంతో.. ఆగస్టు 7న కుటుంబీకులు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో ఇమ్రాన్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆగస్టు 5న ఇమ్రాన్తో పాటు లక్ష్మణ్ సింగ్ అలియాస్ సూను సింగ్తో పాటు మరో ఐదుగురు.. అరుణ్కుమార్, శేఖర్, శ్యాంసుందర్, రాహుల్, సతీష్లు చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనగర్కు వెళ్లారని పోలీసులు తెలిపారు. వారు మూసీ నది సమీపంలోని నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ డబ్బు విషయాల గురించి చర్చ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ చర్చ ఇమ్రాన్తో పాటు మరో ఆరుగురు వ్యక్తుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మొత్తం ఆరుగురు వ్యక్తులు పదునైన ఆయుధాలతో ఇమ్రాన్ను పొడిచి అక్కడికక్కడే హత్య చేశారు. మృతదేహాన్ని నిర్జన ప్రదేశానికి ఈడ్చుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. బూడిదను నిందితులు మూసీ నదిలో పారవేసినట్లు సరూర్నగర్ పోలీసులు తెలిపారు. విచారణలో ఇమ్రాన్ను హత్య చేసినట్లు అంగీకరించిన అరుణ్కుమార్, శేఖర్, శ్యాంసుందర్, రాహుల్, సతీష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూను సింగ్ పరారీలో ఉన్నాడు. మొత్తం ఐదుగురిని రిమాండ్కు తరలించారు. హత్యను కప్పిపుచ్చేందుకు, నిందితులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఇమ్రాన్ కుటుంబసభ్యులు ఆరోపించారు.