ఫామ్ హౌస్ ఫైల్స్ కు , రాజ్ భవన్ కు మధ్య లింకు ఉందని చెప్పే సంకేతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో తుషార్ ప్రధాన నిందితుడు. ఆయన గతంలో తమిళ సై దగ్గర ఏడీసీగా పనిచేశారు. ఆ విషయాన్ని ఆమె మీడియా వద్ద ప్రస్తావించారు. అంటే, ఫామ్ హౌస్, గవర్నర్ కార్యాలయం మధ్య ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందనే అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని గవర్నర్ తమిళ సై కూడా ప్రస్తావిస్తూ ఫోన్ల ట్యాపింగ్ జరుగుతుందని అనుమానం వ్యక్త పరిచారు.
ఏడాది కాలంగా ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య వివాదం నడుస్తున్నప్పటికీ ఈసారి సీరియస్ గా మారింది. ప్రభుత్వం పంపిన విద్యార్థుల బిల్లును గవర్నర్ తిరస్కరించారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో బోధనా సిబ్బందిని నియమించాలని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో యూనివర్సిటీల బోధనా సిబ్బంది కామన్ రిక్రూట్మెంట్ బిల్లును ప్రవేశపెట్టింది. దాన్ని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లును ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసైకు పంపించారు. ఆ బిల్లును తమిళ సై పరిశీలనలో పెట్టారు. ఒక వేళ ఈ బిల్లును అమోదించకపోతే ఈనెల 12వ తేదీన రాజ్ భవన్ వద్ద ధర్నాకు దిగుతామని యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ హెచ్చరించింది. సరిగ్గా అదే రోజున ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం వస్తున్నారు.
ఇటీవల దాకా సీఎంవో, రాజ్ భవన్ మధ్య జరిగిన గిల్లికజ్జాలు ఇప్పుడు రోడ్డు పడ్డాయి. హెలికాప్టర్ ఏర్పాటు, ప్రోటోకాల్, ఎమ్మెల్సీ ఎంపిక బిల్లుపై అభ్యంతరం..ఇలా స్వల్ప అంశాలపై ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య తేడా వచ్చింది. ఈసారి ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు, గవర్నర్ తమిళ సై ప్రమేయానికి ముడివేసే ప్రయత్నం జరుగుతోంది. అందుకు సంబంధించిన లీకులను తెలంగాణ భవన్ ఇస్తోంది. ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో గవర్నర్ ప్రమేయం ఉందని తేలితే, సీఎం కేసీఆర్ చెప్పినట్టు దేశ వ్యాప్తంగా పొలిటికల్ బాంబ్ పేలినట్టే!