MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత

  • Written By:
  • Updated On - January 26, 2024 / 08:32 PM IST

MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్టించాలన్న డిమాండ్ తో త్వరలో మహాధర్నా చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానికి సంబంధించి కొద్దిరోజుల్లో తేదీలను వెల్లడిస్తామని చెప్పారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం భారత్ జాగృతిలో ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు హాజరయ్యి మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. అనంతరం 9 తీర్మానాలను ఆమోదించారు. ప్రధానంగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఇచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి తదుపరి కార్యాచరణలో చేర్చుతామని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం తాము చేస్తున్న ఈ పోరాటానికి మద్ధతుగా రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ధర్న చౌక్ వద్ద మహాధర్నా నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ప్రతి గ్రామం నుంచి 10-15 పోస్టు కార్టులు పంపించడం వంటి సూచనలు వచ్చాయని, వాటిపై కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. ఏప్రిల్ 11లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా చేస్తామని చెప్పారు. అలాగే, దేశం ఎటు వైపు వెళ్తుందన్న చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత జాగృతి ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం పోరాటం చేసి సాధించామని గుర్తు చేశారు. బడుగుల కోసం పనిచేసిన ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.

అసెంబ్లీ అవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్ కు వినతి పత్రం అందించామని, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్ధతు కూడగట్టడానికి లేఖ అందించామని చెప్పారు. విగ్రహం పెట్టడంతోనే విగ్రహం వస్తుందా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారని, కానీ బీసీల అభ్యున్నతి కోసం భారత్ జాగృతి అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. బీసీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పోరాటం చేస్తామని ప్రకటించారు.

మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించామని, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాని అన్నారు. అనేక సంఘసంస్కర్తల జయంతులను తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారికంగా నిర్వహించుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు దక్కాయని, గత పదేళ్లలో బీసీల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఆ పరంపర కొనసాగింపుగా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల కోసం పనిచేయాలని ఒత్తిడి చేస్తామని, అందులో భఆగంగా తొలి అడుగుగా విగ్రహ సాధన కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పారు.