తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన గవర్నర్ చర్యను ఇప్పటికే మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు తప్పుపట్టగా తాజాగా ఆ లిస్ట్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరారు.గవర్నర్లు వారి పరిమితులను తెలుసుకొని మాట్లాడాలని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గవర్నర్ ల పరిధి అంశాన్ని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని తెలిపిన ఆయన గవర్నర్ వ్యవస్థే వద్దని చాలాకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు.
కేంద్ర పెద్దలను కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని దాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారన్న శ్రీనివాస్ యాదవ్ గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడడాన్ని తప్పుపట్టారు. ఎలాంటి తప్పిదాలు జరగనప్పుడు అవనసరంగా విమర్శలు చేయడమేంటని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన గవర్నర్లను గౌరవించడం ఎలాగో సీఎం కేసీఆర్ కు, తమకు తెలుసని ఆయన తెలిపారు.