Minister Tummala Nageswara Rao Is Currently Stranded In Dubai : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమ ఆసియాను కుదిపేస్తుండగా, ఆ ప్రభావం దుబాయ్పై తీవ్రంగా పడింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యుడి వైద్య చికిత్స నిమిత్తం దుబాయ్కు వెళ్లారు. అయితే యుద్ధ వాతావరణం కారణంగా తిరిగి వచ్చే అవకాశం లేకపోవడంతో, ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోవడంతో మంత్రి తుమ్మల తిరుగు ప్రయాణం అనిశ్చితిలో పడింది. ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులపై సమీక్ష పూర్తయి, అధికారులు క్లియరెన్స్ ఇచ్చే వరకు విమానాల రాకపోకలు పునరుద్ధరించబడవు. అయితే, మంత్రి తుమ్మల సురక్షితంగానే ఉన్నారని, భారత రాయబార కార్యాలయం మరియు స్థానిక అధికారులతో తన అనుచరులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. విమాన సర్వీసులు ప్రారంభం కాగానే ఆయన వెంటనే భారత్కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రస్తుతం దుబాయ్లోనే ఉంటూ మంత్రి తన శాఖకు సంబంధించిన ముఖ్యమైన పాలనా పరమైన నిర్ణయాలను ఫోన్ ద్వారానే సమీక్షిస్తున్నట్లు సమాచారం.
మంత్రి కుటుంబ సభ్యుడి అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం దుబాయ్ వెళ్లారన్న వార్తతో ఆయన ఆరోగ్యంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చలు జరిగాయి. కానీ, ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుడి ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. యుద్ధం సద్దుమణిగి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ఆయన దుబాయ్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను క్షేమంగానే ఉన్నానని మంత్రి స్వయంగా తెలిపినప్పటికీ, పార్టీ శ్రేణులు ఆయన క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఆందోళనతోనే ఉన్నారు.
