మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Ex PM Manmohan Singh)కు అసెంబ్లీలో నివాళులు అర్పించే సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu ) బీజేపీ నేతల (BJP Leaders) వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటన గురించి సభలో ప్రస్తావించడం సరికాదని, ఇలాంటి సందర్భాల్లో సంయమనం పాటించాలని సూచించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.
సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం సీఎం (CM Revanth) మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు అద్భుతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన ప్రధానిగా మార్గం సుగమం చేశారని, 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆయన సారథ్యంలోనే అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయనకు శాశ్వత స్థానం ఉందని అన్నారు.
2013లో భూ సేకరణ చట్టం ద్వారా మన్మోహన్ సింగ్ గ్రామీణ ప్రజల జీవితాలలో మార్పు తీసుకువచ్చారని సీఎమ్ తెలిపారు. భూమిలేని వారికి కూడా నష్టపరిహారం అందించేలా చట్టం రూపకల్పన చేయడం గొప్ప సాధనగా ఆయన అభివర్ణించారు. ఈ చట్టం గ్రామీణ అభివృద్ధికి శక్తినిచ్చిందని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాల్లో చేసిన సేవలు దేశానికి దిశానిర్దేశం చేశాయని రేవంత్ కొనియాడారు. 1991-96 మధ్య ఆర్థిక విధానాలు సరళీకృతం చేసి, దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేశారని అన్నారు. ప్రపంచ స్థాయిలో ఇండియాను పోటీపడే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన్మోహన్దేనని గుర్తుచేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ విశిష్ట సేవలు అందించారని సీఎం తెలిపారు. ఆధార్ వంటి సామాజిక విప్లవ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజలకు లబ్ధి చేకూర్చారని అన్నారు. ఆయన సేవలు ఎప్పటికీ భారతదేశానికి మార్గదర్శకమని, దేశ ప్రజలు ఆయనను గౌరవంతో గుర్తుంచుకుంటారని సభలో పేర్కొన్నారు.
Read Also : New Year First Week : హ్యాపీ న్యూ ఇయర్.. 2025 జనవరి 1 నుంచి జనవరి 7 వరకు రాశిఫలాలు