తెలంగాణలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలని ఆమె కోరారు. మహిళా,శిశు సంక్షేమ శాఖకు చెడ్డ పేరు తీసుకురావద్దని.. న్యాయ మైన డిమాండ్స్ నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాత సమ్మె చేయడం కరెక్ట్ కాదని.. సమాజంలో గర్భిణీలు, బాలింతలు,చిన్నారులు ఎక్కువమంది బలహీన వర్గాల వారేనని.. వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని ఆమె కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట వేస్తుందని.. వాస్తవాలను గ్రహించి వెంటనే విధులకు హాజరు కావాలన్నారు. కొందరు ఉద్దేపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం కష్టమని.. కేంద్ర ప్రభుత్వనికి అంగన్ వాడీల తరుపున లేఖ రాస్తామని తెలిపారు. అవసరమైతే కేంద్ర మంత్రులను కలిసి అప్పీల్ చేస్తామని.. ప్రభుత్వం ఉద్యోగుల మాదిరే పీఆర్సీని ఇస్తామన్నారు. అంగన్వాడీలు రెగ్యులర్ చేయాలని డిమాండ్ కేంద్ర పరిధిలోని అంశమన్నారు.