Munugode: మునుగోడులో మంత్రి మందు పార్టీ.. ఎవ‌రికంటే..?

మునుగోడులో ఎన్నిక‌ల వాతవ‌ర‌ణం నెల‌కొంది. మందు, విందు రాజకీయం కూడా ఊపందుకుంది.

  • Written By:
  • Publish Date - October 10, 2022 / 06:05 AM IST

మునుగోడులో ఎన్నిక‌ల వాతవ‌ర‌ణం నెల‌కొంది. మందు, విందు రాజకీయం కూడా ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి పేరున్న నాయ‌కులే రంగంలోకి దిగి.. మందు, విందును స‌మ‌కూరుస్తున్నారు. స్వయంగా మంత్రే మందు బాటిల్ చేతబట్టి విందు ఇస్తున్న ఫొటో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి మల్లారెడ్డి మద్యం బాటిల్ పట్టుకొని సర్వ్ చేయడం ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు ప్రధాన పార్టీలు మునుగోడు ఉపఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రధాన పార్టీలు తమ బలాలను చూప‌టానికి సిద్ధ‌మ‌య్యాయి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కో గ్రామానికి ఒక్కొక్కరు ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ ఇంచార్జ్‌గా మంత్రి మల్లారెడ్డి నియమితులయ్యారు.

ఈ క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి చౌటుప్పల్‌లో ఓ హోటల్‌లో ఆదివారం ప్రచారం ముగించుకున్న మంత్రి మల్లారెడ్డి తమ పార్టీ నాయకులకు ఆ హోటల్‌లో మందు పోస్తూ కెమెరాకు చిక్కారు. దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మల్లారెడ్డి మందు పోయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.