తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని.. ఇటీవల జోరుగా చర్చ సాగుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు ప్లస్ అవుతుందని పేర్కొనడంతో ఇక ముందస్తు ఖాయమని చర్చ జరుగుతోంది. ఈ ముందస్తు ఎన్నికలపై నేడు మంత్రి కేటీఆర్ స్పష్టతనిచ్చారు. ముందస్తు ఆశలపై నీళ్లు చల్లారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురైందన్నారు. పార్టీ చేరికలపై తాము ఎవరినీ బలవంతం చేయలేదని పేర్కొన్నారు.
ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘మాకున్న సమాచారంతో టీఆర్ఎస్ 90 సీట్లలో గెలుస్తుంది. కేసీఆర్ మూడోసారి సీఎం కావడం తథ్యం. మా పార్టీలో ఉన్న విభేదాలు మా బలానికి నిదర్శనం. ఎవరిని బలప్రయోగం చేయలేదు. దక్షిణాదిలో వరుసగా మూడోసారి సీఎం అయిన నేత లేరు. వచ్చే ఎన్నికల్లో బలాలు.. బలహీనతలు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తాం. కేంద్రం అభివృద్ధిలో తెలంగాణ ఉంది.. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర లేదు. నేను చెప్పింది అబద్ధం అని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా! తెలంగాణ గవర్నర్ తో మాకు పంచాయితీ లేదు. రాహుల్ గాంధీ సిరిసిల్లకు వస్తే స్వాగతిస్తాం. కాంగ్రెస్ పాలనలో ఎట్లున్నది.. ఇప్పుడు ఎట్లున్నదనేది రాహుల్ చూడాలి. రాహుల్ గాంధీ రెండు రోజులు సిరిసిల్లలో ఉండాలని కోరుతున్నా. కేసీఆర్ అభివృద్ధి ఎలా చేశారో చూసి నేర్చుకోవాలి. రాహుల్కి అమేథి, రేవంత్కి కొడంగల్లో చెల్లని నాణేలు’’ అని ఎద్దేవా చేశారు.