పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 5మిడ్డే మీల్స్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దాదాపు 54 వేల మందికి పైగా మధ్యాహ్న భోజన (ఎండీఎం) కార్మికులు సమ్మె చేస్తుండటంతో రెండు రోజులుగా తెలంగాణ పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకుండా పోయింది. గురువారం నాలుగో రోజుకు చేరిన సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో భోజన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులపై సమ్మె ప్రభావాన్ని తగ్గించడానికి తెలంగాణ విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను (DEO) ఆదేశించింది. విద్యార్థులు ఇంటిదగ్గర నుంచే లంచ్బాక్స్లు తీసుకురావాలని అధికారులు ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల్లో 75-80% మంది మధ్యాహ్న భోజనంపై ఆధారపడుతున్నారు.ఇప్పుడు వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఎండీఎం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గౌరవ వేతనాన్ని రూ.3,000కు పెంచాలని గతంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇంకా చెల్లింపులు అందలేదని కార్మికులు పేర్కొంటున్నారు.
సమ్మె త్వరలో ముగుస్తుందని విద్యాశాఖ భావిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించేందుకు ఉద్యోగుల సంఘం నేడు (గురువారం) చలో హైదరాబాద్కు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందనపై భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని కార్మికులు అంటున్నారు. ఈ సమ్మె లక్షలాది మంది విద్యార్థుల రోజువారీ భోజనాన్ని ప్రభావితం చేయడమే కాకుండా డ్రాపౌట్ రేటును పెంచే ప్రమాదం ఉంది, ఎందుకంటే చాలా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి ప్రోత్సాహకంగా ఈ భోజనంపై ఆధారపడతాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు, గౌరవ వేతనాల మంజూరులో జాప్యం కారణంగా మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొన్న కాంట్రాక్టర్లు కూడా నిరసనకు దిగారు. దీనికి స్పందించి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కిరాణా సామాను కొనుగోలు చేయడంతోపాటు విద్యార్థులకు భోజనం పెట్టేందుకు వంటవాళ్లను నియమించడంతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక్క నల్గొండలోనే ఏజెన్సీలకు రూ.1.3 కోట్లు బకాయిలు ఉండగా, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రూ.1.40 కోట్లు, రూ.1.81 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి.