వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఓ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అనస్థీషియా విభాగంలో మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎండీ) చదువుతున్న ప్రీతి అనే విద్యార్థిని బుధవారం డ్యూటీలో ఉండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉదయం 6.30 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అత్యవసర వార్డులో చేర్చారు. అక్కడ CPR నిర్వహించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. మెడికో ప్రీతిని హైదరాబాద్లోని నిమ్స్లో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిమ్స్లో ఆమె తండ్రి నరేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీనియర్లు వేధింపులు భరించలేకే తమ కూమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. గతేడాది నవంబర్ నుంచి ఓ సీనియర్ విద్యార్థి తన కూతురిని వేధిస్తున్నాడని, ఈ విషయాన్ని కేఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వరంగల్లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్)లో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్గా నరేంద్ర పని చేస్తున్నారు. తన కుమార్తె తన తోటి విద్యార్థుల మద్దతు కోరిందని..అయితే వారు అదే కళాశాలలో మరో రెండేళ్లు ఉండాలని.. ఫిర్యాదు చేసతే వారు ఇంకా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో తోటి విద్యార్థులు కూడా ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆమె ఈ దారుణానికి ఓడిగట్టిందని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.