మునుగోడు ఉపఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లమధ్య పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2018లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే కొన్నాళ్ల క్రితం కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవితోపాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది.
అయితే మునుగోడులో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో అధికార పార్టీ ఉంది. ఇందులో భాగంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈక్రమంలోనే విపక్షాలకు ధీటుగా కార్యక్రమాలు నిర్వహించాలన్న ప్లాన్ చేస్తోంది అధినాయకత్వం. ఇప్పుడు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులో వేస్తోంది టీఆర్ఎస్ . నియోజకవర్గంలో వారంరోజుల పాటు సామూహిక మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని చేపట్టి…ఓటర్ల మనస్సు గెలవాలన్న తాపత్రాయ పడుతోంది.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి భోజనం చేస్తూ వారి సాదకబాధకాలను తెలుసుకుంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాలు, గ్రామాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నారు. మొత్తానికి మునుగోడు ప్రజల గోడు వినేందుకు అధికార పార్టీకి ఇప్పుడు కనవిప్పు కలిగిందని మునుగోడు ప్రజానీకం అనుకుంటున్నారు. ఎన్నికలు వస్తేకానీ తమ సమస్యలకు పరిష్కారం దొకరకడం లేదంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ముప్పుతిప్పలు పడుతున్న అధికార, విపక్ష పార్టీలో ఎవరు విజయం సాధిస్తారనేది రానున్న రోజుల్లో చూడాలి. మొత్తానికి మునుగోడు ప్రజలు మాత్రం రాజకీయ పార్టీలు చేస్తున్న సందడితో బీజీగా మారారు.