Maoist Bandh : ఇవాళ మావోయిస్టుల భారత్ బంద్‌.. ఏజెన్సీ ఏరియాల్లో హైఅలర్ట్

Maoist Bandh : మావోయిస్టులు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణలోని భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

  • Written By:
  • Updated On - December 22, 2023 / 08:19 AM IST

Maoist Bandh : మావోయిస్టులు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణలోని భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లోని దండకారణ్యాన్ని భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు విధ్వసం సృష్టించారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో దుశ్చర్యకు పాల్పడ్డారు. వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టులు దాడి చేశారు. కార్లకు నిప్పంటించారు. ఈ నెల 22న(ఇవాళ) తాము ఇచ్చిన భారత్ బంద్ పిలుపును విజయవంతం చేయాలంటూ కరపత్రాలను వదిలి వెళ్లారు. ఇటీవల పోలీసు ఎన్‌కౌంటర్లలో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినందుకు నిరసనగా ఈరోజు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌‌లో మావోయిస్టులు, పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో మావోయిస్టులకు చెందిన పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన దాడుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిసింది. అణచివేత వ్యతిరేక వారోత్సవాల చివరి రోజైన 22వ తేదీన(ఇవాళ) బంద్‌ను మావోయిస్టులు ప్రకటించారని అంటున్నారు. గత 22 నెలలుగా జార్ఖండ్‌లో విప్లవ ఉద్యమంపై కేంద్రం అనుసరిస్తున్న దౌర్జన్యానికి నిరసనగా ఈ బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తోందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి కార్మికులు, రైతులు, మధ్యతరగతి, జాతీయ పెట్టుబడిదారీ వర్గాల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని(Maoist Bandh) పిలుపునిస్తున్నారు.