Manukota Stones : మానుకోట ఘటన జరిగి నేటికి సరిగ్గా 14 ఏళ్లు. 2010 మే 28న జరిగిన ఈ ఘటనపై ఇవాళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు. మానుకోట ఘటన తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది అని ఆయన చెప్పారు. ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయన్నారు. తుపాకీ తూటాలకు దీటుగా సామాన్య ప్రజల రాళ్లు తిరగబడ్డాయని పేర్కొన్నారు. పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందిస్తూ ఉద్యమ కారులు చూపిన తెగువకు సమైక్య పాలకులు వెనుదిరగక తప్పలేదని హరీశ్రావు గుర్తుచేశారు.
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏళ్లు.
ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు దీటుగా… pic.twitter.com/niygts5ah7
— Harish Rao Thanneeru (@BRSHarish) May 28, 2024
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ ఉద్యమం ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చే కుట్రను మానుకోట మట్టి సాక్షిగా ఉద్యమకారులు ఏకమై తిప్పి కొట్టారని హరీశ్ రావు కొనియాడారు. తద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను మానుకోట ప్రజలు యావత్ దేశానికి బలంగా చాటిచెప్పారని పేర్కొన్నారు. తుపాకీ తూటాలకు వెరవకుండా.. లాఠీలకు భయపడకుండా మానుకోట ప్రజలు చూపిన సాహసానికి సలాం అని ఆయన వ్యాఖ్యానించారు. స్వరాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఆనాడు జరిగిన ఉద్యమానికి మానుకోట ప్రజలు ఊపిరులు ఊదారని ప్రశంసలు కురిపించారు. మానుకోట ఘటనకు సంబంధించిన చారిత్రక సన్నివేశాలు ఇంకా తన కళ్ల ఎదుటే కదలాడుతున్నాయని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఆ ఘటన చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.