హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూరేలా కీలక ఒప్పందం కుదిరింది. రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) ముందుకు వచ్చింది. ఈ మేరకు ఢిల్లీలో ఇరు సంస్థల ఉన్నతాధికారులు అధికారికంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
20 ఏళ్ల పాటు ఊరట
ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్కుమార్ దూబె, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సమక్షంలో ఈ డీల్ ఖరారైంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం రాబోయే 20 ఏళ్ల కాలపరిమితితో, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ రుణాన్ని చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల హైదరాబాద్ మెట్రోపై ఉన్న తక్షణ ఆర్థిక భారం తగ్గనుంది.
ప్రభుత్వానికే 100 శాతం వాటా
ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు కీలక విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో 100 శాతం యాజమాన్య వాటా పూర్తిగా ప్రభుత్వానికే బదిలీ అయినట్లు స్పష్టం చేశారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
కనెక్టివిటీ పెంచడమే లక్ష్యం
దేశ ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్ నగరం కీలక ఇంజిన్లా మారుతోందని సీఎస్ పేర్కొన్నారు. మెట్రో రైలు కనెక్టివిటీని మరింత విస్తరించడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ చాలావరకు తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రీఫైనాన్స్ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్సీ, ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ఎల్ బృందాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
