Group 1 : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో ఇక్కడిదాకా వచ్చి.. ఇప్పుడు భర్తీ ప్రక్రియను ఆపడం సరికాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ దశలో తాము గ్రూప్-1 పరీక్షల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణను నిలుపుదల చేస్తే.. ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అందుకే గ్రూప్-1 పరీక్షల(Group 1) నిర్వహణ ప్రక్రియను కొనసాగించడమే శ్రేయస్కరమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియపై అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. గ్రూప్-1 అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.
Also Read :Madrasas : కేంద్రానికి షాక్.. ఆ మదర్సాల మూసివేత ఆదేశాలపై ‘సుప్రీం’ స్టే
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాలి అని డిసైడ్ అయిన 95 శాతం మంది అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్ష కేంద్రాల వద్ద వేచి ఉన్న అభ్యర్థులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భారీ ఊరట లభించింది. అభ్యర్థులు ఇవాళ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్న తరుణంలో.. మొత్తం రిక్రూట్మెంట్ను వాయిదా వేయలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఈరోజు నుంచి ఈనెల 27 వరకు జరుగుతాయి. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 46 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
Also Read :Hezbollah Vs Israel : ఇజ్రాయెల్ భయం.. హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ ఇరాన్కు పరార్
గ్రూప్-1 ప్రిలిమ్స్లో 33,383 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రెండుసార్లు నిర్వహించారు. అయితే పరీక్షల నిర్వహణ ప్రక్రియలో లోపాలను గుర్తించడంతో వాటిని రద్దు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ ఏడాది జూన్లో మూడోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఇప్పుడు మెయిన్స్ జరుగుతున్నాయి. మెయిన్స్లో అర్హత సాధించేవారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.