Minister KTR: జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం: మంత్రి కేటీఆర్ పిలుపు

జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

  • Written By:
  • Updated On - August 5, 2023 / 03:51 PM IST

ఈనెల 7వ తేదీన జరగనున్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించబోతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రజా ప్రతినిధులకు లేఖ రాశారు. ’’తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.  గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి ఆలోచనల మేరకు అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ది కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది’’ అని కేటీఆర్ అన్నారు.

‘‘చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా ఏ ప్రభుత్వము కేటాయించని విధంగా 2016-2017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ రూ. 1200 కోట్ల చొప్పున కేటాయిస్తు వస్తున్నాం.  ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యల పాలవుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. 2010 నుంచి ఉన్న లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయడంతో 10,148 చేనేత కార్మికులు రూ.28.97 కోట్ల ఋణాల నుండి విముక్తి అయ్యారు’’ మంత్రి గుర్తు చేశారు.

‘‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలను గుర్తిస్తూ, వారి మగ్గాలను జియో ట్యాగ్  చేయడం జరిగింది. రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితులపైన పూర్తి అవగాహనతో అనేక కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేత మిత్ర పథకం ద్వారా దాదాపు 50% రాయితీని వస్త్రాలు, రసాయనాల కొనుగోలు పైన అందిస్తున్నాం. చేనేత మిత్ర పథకం ద్వారా ఇప్పటివరకు 22 వేల మంది నేతన్నలకు  సూమరు 90 కోట్ల సబ్సిడీని నేరుగా వారి ఖాతాలలోనే అందుకున్నారు.  నేతన్నలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుడు పొదుపు చేసే 8 శాతానికి రెట్టింపుగా 16శాతం, పవర్ లూమ్ కార్మికులు పొదుపు చేసుకునే 8 శాతానికి అదనంగా మరో 8 శాతం మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. 2017లో ప్రారంభమైన ఈ పథకాన్ని కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో లాకింగ్ పిరియడ్ ను సవరించి మరీ ముందస్తు వెసులుబాటు ఇవ్వడం వలన దాదాపు 100 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని, రాష్ట్రంలోని 21 వేల నేతన్నలు అందుకున్నారు. నేత కార్మికుల కోరిక మేరకు ఈ పథకాన్ని రూ.90.00 కోట్ల బడ్జెట్ ప్లాన్ తో తిరిగి ప్రారంభించాము.  ఇప్పటివరకు ఈ పథకంలో 32,328 మంది చేనేత కార్మికులు చేరారు. రాష్ట్రంలోని రైతన్నలకు అందుతున్న రైతు బీమా మాదిరే నేతన్నకు ప్రత్యేకంగా 5లక్షల రూపాయాల నేతన్నకు భీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 59 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న 40,000 మంది నేతన్నలకు బీమా కవరేజ్ ను అందిస్తున్నాం’’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

‘‘చేనేత కళ అంతరించి పోకుండా భవిష్యత్తు తరాలకు అందించాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో TSCO ద్వారా ప్రత్యేక R&D విభాగము ఏర్పాటు చేసి, చేనేత రంగములో డిజైన్లు మరియు వస్త్రోత్పత్తి పరిశోధనలో భాగముగా… తెలంగాణలో ఒకప్పుడు ప్రాచుర్యము పొంది కాలక్రమేణా అంతరించిపోయిన చేనేత కళాకృతులను వెలికితీసి, వాటికి నవీనరీతులను జోడించడం జరిగింది. తద్వారా TSCO “పీతాంబరి పట్టు చీరలు”, “ఆర్మూరు పట్టు చీరలు”, “హిమ్రా చేనేతలు”, “సిద్ధిపేట గొల్లభామ చీరలు” “మహాదేవపూర్ టస్సర్ పట్టుచీరల”లాంటి ఒకప్పటి గొప్ప కళాకృతులను పరిశోధించి, తిరిగి వెలికితీసి మనుగడలోనికి తీసుకురావడం జరిగినది. చేనేత రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న నేతన్నలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది.  పావలా వడ్డీ పథకము, మగ్గముల ఆధునీకరణ పథకము చేపట్టడంతోపాటు చేనేత వస్త్ర ప్రదర్శనలు,  చేనేత రంగములో శిక్షణ మరియు మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా గద్వాలలో హ్యాండ్లూం పార్కు ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం’’ అని తెలియజేశారు.

‘‘ప్రతి ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో చేనేత వారోత్సవాలు జరగనున్నాయి. దీంతోపాటు 7 తేదీ నుంచి 14వ తేదీ వరకు పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగుతుంది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 7500 మంది నేతన్నలతో రాష్ట్రస్థాయి చేనేతల సంబరాలను నిర్వహించనున్నాం. కేవలం సంబరాలే కాకుండా ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక నేతన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించబోతున్నది. చేనేత మిత్ర కార్యక్రమాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేతన్నలకు సమగ్ర ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. దీనికి అదనంగా నేత్ననకు బీమా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించబోతున్నాం. ప్రస్తుతం ఉన్న పిట్ లూమ్స్ ను ఫ్రేమ్ లూమ్స్ గా అప్ గ్రేడ్ చేసేందుకు తెలంగాణ చేనేత మగ్గం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. హైదరాబాద్ లోని శిల్పారామంలో చేనేత హ్యాండీక్రాఫ్ట్ మ్యూజియం, ఉప్పల్ బగాయత్ లో కన్వెన్షన్ సెంటర్ కు శంఖుస్ధాపన చేయనున్నాం’’ అని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రాసిన లేఖలో ప్రస్తావించారు.

Also Read: Kangana Ranaut: చంద్రముఖి2 నుంచి కంగనా ఫస్ట్ లుక్ రిలీజ్, డిఫరెంట్ గెటప్ లో బాలీవుడ్ క్వీన్