Site icon HashtagU Telugu

Ananthagiri Hills: అనంతగిరి అడవుల్లో చిరుత కలకలం, టూరిస్టులు అలర్ట్!

Leopard

Leopard

Ananthagiri Hills: వికారాబాద్ జిల్లా అడవులు, ప్రత్యేకించి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చిరుత పులి తిరుగాడుతున్నట్టు స్థానికులు గుర్తించారు. 10 సంవత్సరాల విరామం తర్వాత అనంతగిరి కొండలకు సమీపంలోని చెదిరిన అటవీ ప్రాంతంలో చిరుతపులి కనిపించింది. ఇటీవల చిరుత ఒక దూడను చంపిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు  కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరా ట్రాప్ ద్వారా చిరుతపులి ఉన్నట్టు నిర్ధారించారు.

దామగుండం అడవుల్లోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటరు, పూడూర్ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో దూడ మృతి చెందింది. పూడూరు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం 7 గంటల ముందు, సాయంత్రం 5 గంటల తర్వాత అడవుల్లోకి రావద్దని వికారాబాద్ జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్ గుమ్మల తెలిపారు. గ్రామస్తులు ఒంటరిగా అడవిలోకి, పరిసర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, పశువులను మేతకు తీసుకెళ్లే వారు సాయంత్రంలోపు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూడాలని ఆయన కోరారు.

అనంతగిరి వారాంతపు సందర్శకులకు ప్రసిద్ధి చెందినందున, అటవీ శాఖ అధికారులు రిసార్ట్ నిర్వాహకులను అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతంలో గతంలో చిరుతలు ఉండేవి కానీ దశాబ్దం క్రితం అవి కనిపించకుండా పోయాయి. “మేము కెమెరా ట్రాప్‌ల ద్వారా దాని కదలికలను పర్యవేక్షించడం కొనసాగిస్తున్నాం. జంతువును గుర్తించినట్లయితే దాని కదలికల గురించి తెలియజేయమని ప్రజలను కోరాం” అని జ్ఞానేశ్వర్ చెప్పారు.