Lal Darwaza Bonalu: కన్నుల పండువగా లాల్‌దర్వాజా బోనాలు

లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలతో భాగ్యనగరంలో సందడి నెలకొంది. తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Lashkar Bonalu

Lashkar Bonalu

లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలతో భాగ్యనగరంలో సందడి నెలకొంది. తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల్లో భాగంగా అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి  బోనాన్నిసమర్పించారు.తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి బోనాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లాల్‌ దర్వాజ్‌ బోనాల్లో పాల్గొన్న తెలంగాణ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలు తెలంగాణ సంస్కృతి అని, రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అటు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధును ఆలయ కమిటీ సత్కరించింది. తనకు బోనాల పండుగ అంటే ఇష్టమని సింధు చెప్పుకొచ్చారు. ప్రతీ ఏటా ఆశీస్సులు తీసుకోవాలని ఉంటుందని.. గత సంవత్సరం షెటిల్ పోటీలు ఉండటంతో రాలేకపోయానని వివరించారు. కోవిడ్ కారణంగా ఆలయానికి రాలేదని చెప్పుకొచ్చారు.

బోనమెత్తిన సింధు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. తాను తిరిగి ఈ రోజు లండన్ వెళ్లనున్నట్లు చెప్పారు. బోనాలు చివరి రోజు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు లాల్‌దర్వాజ అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  Last Updated: 24 Jul 2022, 09:27 PM IST