తెలంగాణ బడ్జెట్ (Telangan Budget) సమావేశాల్లో భాగంగా రెండోరోజు గవర్నర్ (Governor) ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ (Akbaruddin) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటూ ఎందుకు నిలదీయలేదన్నారు అక్బరుద్దీన్. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగానికి గవర్నర్ ఏమైనా మార్పులు, చేర్పులు సూచించారా? అని ప్రశ్నించారు. అసలు గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించిందా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉందంటూ ప్రశ్నించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, కేబినెట్ లో జరిగిన ప్రతి విషయాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు.
పాతబస్తీకి మెట్రో రైలు ఏమైంది? : అక్బరుద్దీన్
అదే సమయంలో పాతబస్తీ అభివృద్ధిపై కూడా అక్బరుద్దీన్ (Akbaruddin) పలు ప్రశ్నలు లేవనెత్తారు. పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. హామీలు ఇస్తారు కానీ వాటిని అమలు చేయరన్నారు. పాతబస్తీకి మెట్రో రైలు ఏమైంది? ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితేంటి? అని ఆయన ప్రశ్నించారు.
ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు : కేటీఆర్
అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ (KTR) గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు కేటీఆర్. అక్బరుద్దీన్ (Akbaruddin) సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారని, ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కేపీ వివేకానంద ధన్యవాద తీర్మానాలు ప్రవేశ పెట్టగా, మండలిలో కూడా గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ధన్యవాద తీర్మానాలు ప్రవేశ పెట్టారు.
Also Read: Job Notification: మెడికల్ కాలేజీల కోసం 313 కొత్త పోస్టులు