Site icon HashtagU Telugu

Congress Promises : కాంగ్రెస్ సర్కార్ కు కేటీఆర్ ప్రశ్నల వర్షం..

Ktr Congress

Ktr Congress

రేవంత్ సర్కార్ (Congress Govt) కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటి వరకు హరీష్ రావు , కేటీఆర్ లు మాత్రమే ప్రభుత్వం పై ప్రశ్నల దాడి చేయగా..ఇక త్వరలో కేసీఆర్ కూడా రంగంలోకిదిగబోతున్నాడు. కాంగ్రెస్ పాలన ఏడాది కావోస్తుండడం తో ఇచ్చిన హామీలు సంగతి ఏంటి అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో రైతులు , రాష్ట్ర ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల పట్ల మాట్లాడుతూ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ సర్కార్ మొదలుపెట్టిన కులగణన సర్వే పై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. సర్వేలు సరే, పథకాలేవీ-పాలనేది? ఉన్నవి ఉంచుతారా, ఊడబీకుతారా ప్రజల ప్రశ్నలకు సమాధానమేది? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదు ? కాంగ్రెస్ అధిష్టానం (Congress leadership) ఎందుకు పట్టించుకోవట్లేదు ? ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కొనే నాధుడు లేక రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం గుండె కరగదా? అని నిలదీశారు.

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్నా, వాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానానికి చలనం రాదా? ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు , రైతు భరోసా అందక రైతన్నలు పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నా కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఎందుకు స్పందించడం లేదు..? అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ అని అరకొర రుణమాఫీతో రైతులను అరిగోస పెడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోదన్నారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజూ ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నా ఎందుకు కనీసం సమీక్షించరని ఆరోపించారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులను వాడుకుని ఇప్పుడు (Groups Exams) గ్రూప్ 1,2,3,4 పరీక్షలపై వారు అడుగుతున్న డిమాండ్లను ఎందుకు నెరవేర్చరని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఏమయిందన్నారు. అవ్వ, తాతలకు నెలకు రూ.4,000 పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారన్నారు. రాష్ట్రంలో నడుస్తున్నది ఏసీబీ, జేసీబీ సర్కార్.. కూల్చడం తప్ప నిలబెట్టడం తెలియని కాంగ్రెస్ సర్కార్ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు నోరు మెదపదని, రాష్ట్రం నుంచి మూటలు వస్తున్నందుకే రాహుల్ మాటలు మూగబోయాయా? అని వరుస ప్రశ్నలతో ప్రజలను ఆలోచనలో , ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసారు కేటీఆర్.

Read Also : Pannun Threat : అయోధ్య రామమందిరంపై దాడి చేస్తాం.. ఉగ్రవాది పన్నూ వార్నింగ్