Lagacharla incident : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. కేటీఆర్ వెంట పట్నం నరేందర్ రెడ్డి భార్య, శ్రీనివాస్ గౌడ్, మహముద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ములాఖత్ తర్వాత చర్లపల్లి జైలు వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడనున్నారు.
లగచర్లలో అధికారుల కార్యక్రమంలో రైతులు దాడి చేశారంటూ.. బొంరాస్పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లను ఎందుకు నమోదు చేశారో పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఒక నేరానికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి తరపున ఆయన భార్య శృతి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు.
కాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు.