తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు పెట్టుబడులపై ద్రుష్టి సారిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఎన్ని పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిన కేటీఆర్ తాజాగా మరోసారి భారీ పెట్టుబడులపై గురి పెట్టబోతున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్-2023లో పాల్గొనేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నారు. కేటీఆర్ కు స్విట్జర్లాండ్ లో ఘన స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గందె శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15వ తేదీన జురిక్ నగరంలో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు.
Also Read: Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2422 జాబ్స్
ఈ కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. పెట్టుబడులే లక్ష్యంగా.. 2018 సంవత్సరంలో మొదటిసారి ఐటీ మినిస్టర్ హోదాలో కేటీఆర్.. దావోస్ పర్యటనకు వెళ్లారు. ప్రపంచంలోని టాప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న సమ్మిట్లో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచే విధంగా కేటీఆర్ అప్పటి పర్యటన దోహదపడింది. అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రతి ఏటా పెట్టుబడులకోసం కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఈ ఏడాది దావోస్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ లో కూడా తెలంగాణ జైత్రయాత్ర కొనసాగాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తరలి రావాలని ఆకాంక్షిస్తున్నామని స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ ప్రతినిధులు తెలిపారు. మంత్రి కేటీఆర్, ఆయనతోపాటు వచ్చే ఇతర సభ్యులకు స్విట్జర్లాండ్ లోని ప్రవాస భారతీయులు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ హయాంలో తెలంగాణలో ఐటీ, పరిశ్రమల రంగం కొత్తపుంతలు తొక్కింది.