KTR: పట్టణాల అభివృద్ధిపై ‘కేటీఆర్’ దిశా నిర్దేశం

  • Written By:
  • Updated On - January 5, 2023 / 05:50 PM IST

రాష్ట్రంలోని పట్టణాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఈ దిశగా నిబద్ధతతో కూడిన ప్రయత్నాన్ని ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అన్ని పురపాలికల మున్సిపల్ కమిషనర్లతో హైదరాబాద్ లో నిర్వహించిన వర్క్ షాప్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పట్టణాల అభివృద్ధిపై కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. పురపాలక శాఖ, దాని అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో హైదరబాద్ కాకుండా మిగతా పట్టణాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం ఎనిమిది సంవత్సరాలుగా సుమారు 16 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

పట్టణాల అభివృద్ధి కోసం చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇంత భారీగా నిధులను కేటాయించడం గొప్ప విషయం అన్న కేటీఆర్, దేశంలో మరే రాష్ట్రం తెలంగాణ లెక్క నిధులను కేటాయించలేదనడం అతిశయోక్తి కాదన్నారు. ఒకవైపు పరిపాలన సంస్కరణలు, నూతన చట్టాలు, నిరంతరం నిధుల వంటి అనేక పద్ధతుల్లో పట్టణాలను అభివృద్ధి చేస్తున్నమని తెలిపారు. తమపై అత్యంత సులువుగా రాజకీయ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కచ్చితంగా గుర్తించాల్సిన అనివార్యతలో ఉన్నాయన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎంపిక కాబడే ఉత్తమ గ్రామ పంచాయతీలు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయన్న సంగతి తాజాగా కేంద్రం ప్రకటించిన అత్యుత్తమ జిల్లా ర్యాంకులతోనూ మరోసారి నిరూపితమైందన్నారు. పురపాలక పట్టణాల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఎవరు కాదనలేరని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాలను ఒకసారి పరిశీలించి రావాలని సూచించారు. అప్పుడు మాత్రమే తెలంగాణలో జరిగిన మౌలిక వసతుల కల్పన స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

తెలంగాణ పురపాలక శాఖను దేశంలోనే అత్యుత్తమ శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తనకున్నదన్న కేటీఆర్, ఈ దిశగా ఉద్యోగులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాము పనిచేస్తున్న సంస్థలో, విభాగంలో ఏదో ఒక మార్పును తీసుకువచ్చామన్న సంతృప్తిని రిటైర్మెంట్ రోజు పొందినప్పుడే జీవితంలో అసలైన విజయం సాధించినట్టు అని కేటీఆర్ చెప్పారు. పురపాలక శాఖలోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సైతం త్వరలోనే పూర్తి అవుతుందన్న కేటీఆర్, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వార్డుకొక పురపాలక అధికారిని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నామని ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు.

మంత్రి కేటీఆర్ ప్రసంగంలోని కీలకమైన అంశాలు
• పట్టణ అభివృద్ధి ఎంతో సవాలుతో కూడుకున్నది. ఈ దిశగా ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చినప్పుడు శీఘ్రమైన పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుంది
• తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం పట్టణాభివృద్ధి దిశగా వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోయింది. అందుకే పట్టణాలకు నిరంతరం నిధులు ఇవ్వడంతో పాటు విప్లవాత్మకమైన మున్సిపల్ చట్టం టిఎస్ బి పాస్ వంటి చట్టాలను తీసుకువచ్చింది.
• నిర్ణీత గడువులోగా భవనాలకు ఆన్ లైన్ లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఇంకేది లేదు అని చెప్పేందుకు గర్వంగా ఉంది. టిఎస్ బి పాస్ అద్భుతమైన సంస్కరణ. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు బలోపేతం చేసేందుకు సలహాలు సూచనలను మున్సిపల్ కమిషనర్లు ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో టిఎస్ బి పాస్ అమలైతున్న విధానం ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ పైన అదనపు కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలి.
• టిఎస్ బి పాస్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని మినహాయించి దాదాపు 1,78,000 దరఖాస్తులకు అనుమతులను పురపాలక శాఖ ఇచ్చింది.
• ప్రతి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మిషన్ భగీరథ, వైకుంఠధామాల నిర్మాణం, గ్రీన్ బడ్జెట్ అమలు చేయడం, ఆధునాతన దోబీ ఘాట్ల ఏర్పాటు, డంపు యార్డుల బయోమైనింగ్, మానవ వ్యర్ధాల శుద్ధి మరియు నిర్వహణ ప్లాంట్ల ఏర్పాటు, ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్లు తయారీ, డిజిటల్ డోర్ నెంబర్ కేటాయింపు వంటి కీలకమైన అంశాలను రోజువారి ఎజెండాలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా ఆయా అంశాల్లో సమగ్రమైన అభివృద్ధి జరిగేలా అధికారులు కృషి చేయాలి
• రాష్ట్రంలో 144 పురపాలక పట్టణాలు ఉంటే అందులో 42 ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ హోదా సాధించడం అద్భుతమైన విషయం.
• వ్యర్ధాల శుద్ధి నిర్వహణలో అంతిమంగా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ఆచరణ వైపు దృష్టి సారించాల్సిన బృహత్తర లక్ష్యాన్ని నిర్ణయించుకొని ముందుకు పోవాలి.
• ఫిబ్రవరి 24వ తేదీన పట్టణ ప్రగతి దినోత్సవ నిర్వహణ.