Rajiv Gandhi Statue Issue : నిన్న (september 16) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం (BR Ambedkar Secretariat) ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని (Rajiv Gandhi Statue) సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహ ఏర్పాటును బిఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతూ వస్తుంది. ఈ క్రమంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేసింది. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే సీఎం రేవంత్ సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కేటీఆర్ అన్నారు.
నేడు జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘గతంలో సోనియా గాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని బూతులు తిట్టినా రేవంత్ రెడ్డి.. వాటిని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు రాజీవ్ విగ్రహాన్ని పెట్టించాడు. కంప్యూటర్ను రాజీవ్ గాంధీ కనిపెట్టారని అంటున్నాడు. దీన్ని బట్టే రేవంతు ఎంత తెలివుందో అర్థం అవుతోంది’ అని విమర్శించారు.
కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉన్నారని.. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తున్నారని.. రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. రైతు భరోసా, పింఛన్ ఎప్పుడిస్తారన్నారు. రూ.2500 ఎప్పుడిస్తారని ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పాలనే లేదు.. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన అంటున్నాడని విమర్శించారు. ఇకనైనా పరిపాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపిస్తామన్నారు.
Read Also : Telangana Liberation Day : బలిదానాలతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం – కిషన్ రెడ్డి