పోలింగ్ ముగిసిన తరువాత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఐదు గంటల తరువాత ఏ క్షణమైన రాహుల్ పక్కన కోమటిరెడ్డి ప్రత్యక్షం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి తిరిగి హైదరాబాదుకు చేరుకున్నారు.
గత నెల 23వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తున్నానంటూ నియోజకవర్గ నేతలతో మాట్లాడిన కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం పది రోజుల్లోగా (నవంబర్ 3లోగా) సమాధానం ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై సీనియర్ కోమటిరెడ్డి వివరణ పై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాహుల్ పాదయాత్రలో వెంకట్రెడ్డి పాల్గొంటారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏఐసీసీ నోటీసులపై క్లీన్ చిట్ ఇచ్చే వరకు ఎవరినీ కలవబోనని ఆయన తెలియజేశారు.