Munugode: మునుగోడులో ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా…ఈనెల 15 విదేశీ పర్యటనకు??

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్లు షురూ కావడంతో...రాజకీయం మరింతగా వేడెక్కింది.

  • Written By:
  • Publish Date - October 9, 2022 / 06:46 PM IST

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్లు షురూ కావడంతో…రాజకీయం మరింతగా వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా ప్రధానపార్టీలన్నీ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ఎన్నో రకాలు ప్రణాళికలను వేస్తోంది. గతం కంటే భిన్నంగా ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించింది. అయితే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఆపార్టీకి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో ప్రచారం చేస్తారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. బీజేపీ నుంచి బరిలో నిలుస్తున్నది తన సోదరుడు కావంతో వెంకటరెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.

గతనెలలో మునుగోడులో ప్రచారానికి తాను సిద్ధమని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ కు మద్దతుగా ఇఫ్పటివరకు ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేదు. ఎక్కడా మాట్లాడటం లేదు. కానీ ముఖ్యనాయకులు మాత్రం వెంకటరెడ్డి ప్రచారం నిర్వహిస్తారని చెబుతున్నారు. పాల్వాయి స్రవంతి కూడా తనకు మద్దతుగా ప్రచారం చేయాలని కోరింది. తాను ప్రచారానికి వస్తానని వెంకటరెడ్డి హామీ ఇచ్చినట్లుగా స్రవంతి తెలిపారు. కాగా ఇవాళ ఆదివారం సీఎల్పీ భట్టి విక్రమార్క మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుమానం వద్దని పార్టీవిజయం కోసం పనిచేస్తారన చెప్పారు.

లెటెస్ట్ అప్ డేట్ ప్రకారం మునుగోడులో ప్రచారానికి దూరంగా ఉండాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 15వ తేదీని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దాదాపు 20 రోజుల పాటు ఆయన కుటుంబంతో అక్కడే ఉంటారు. మునుగోడు పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం పార్టీకి కలిసి వస్తుందని అంతా భావించారు .కానీ ఆయన ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. పార్టీ ముఖ్య నేతలు ఆయన మనస్సు మారుస్తారో లేదో చూడాలి.