Komatireddy Is Upset: రాష్ట్ర నాయకత్వాన్ని మార్చండి : కోమటిరెడ్డి

మాణిక్యం ఠాగూర్‌, రేవంత్‌రెడ్డిలను తక్షణమే పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు.

Published By: HashtagU Telugu Desk
komati reddy revanth

komati reddy revanth

మాణిక్యం ఠాగూర్‌, రేవంత్‌రెడ్డిలను తక్షణమే పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. కమల్‌నాథ్‌ లాంటి సీనియర్‌ నేతను ఇన్‌ఛార్జ్‌గా నియమించి పీసీసీ కొత్త చీఫ్‌గా నియమించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సోనియా గాంధీకి లేఖ రాశారు. లేకుంటే తెలంగాణలో పార్టీ చచ్చిపోతుంది. అభిప్రాయ సేకరణ చేసి కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య వివాదం, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సైతం పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవటంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటర్‌ రెడ్డి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
‘రేవంత్‌ వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ నాశనమయ్యింది. ఆయనతో వేదిక పంచుకోలేకనే.. సమావేశానికి హాజరుకాలేదు. అనుచరులతో రేవంత్‌ అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. మాకు ప్రాధాన్యత లేదు.. అందుకే మునుగోడు ప్రచారానికి వెళ్లను. మాణిక్కం ఠాగూర్‌ను తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి తొలగించాలి. ఆయన స్థానంలో కమల్‌నాథ్‌ లాంటి వాళ్లకు ఇన్‌ఛార్జ్‌గా ఇవ్వాలి. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.’ అని లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి.

 

  Last Updated: 23 Aug 2022, 12:10 AM IST