తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇదే మాటను పదే పదే చెబుతూ వస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలంటూ తమ కార్యకర్తలను పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తెగేసి చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంతో తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. నిర్మల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2023 డిసెంబర్ వరకు సాధారణ ఎన్నికలకు గడువు ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఆరునెలల ముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అకాశం ఉందన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఏప్రిల్, మే నెలల్లో కర్నాటకతో పాటు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ కూడా ముందస్తుకు రెడీ అవుతున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే..టీఆర్ఎస్, కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు కర్రకాల్చి వాతపెట్టినట్లు బుద్ది చెబుతారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే ఎదుర్కొనేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.