బీజేపీ (BJP) నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మళ్లీ కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరేందుకు సిద్ధమవుతున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) తో రాజగోపాల్ రెడ్డి భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్లో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారని, కాంగ్రెస్లో చేరికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పొంగులేటి సంప్రదింపులు జరుపుతున్నట్లు కాంగ్రెస్లోని ఓ వర్గం నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి వెళ్లిన నేతలు తిరిగి కాంగ్రెస్లోకి రావాలని పిలుపునిచ్చిన విషయం విధితమే.
గతేడాది ఆగస్టు నెలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడులో బీజేపీ నిర్వహించిన సభలో అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్దినెలల క్రితం వరకు తెలంగాణలో బీఆర్ ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని రాజగోపాల్ చెప్పుకుంటూ వచ్చారు. ఇటీవలి కాలంలో బీజేపీలో వర్గ విబేధాలకుతోడు, కర్ణాటకలో బీజేపీ ఘోర పరాభవంతో రాజగోపాల్ బీజేపీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. బీజేపీలో ఉన్నాబీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించలేమని, కేసీఆర్ ను సీఎం కుర్చీ నుంచి దించాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన భావిస్తున్నారని, తద్వారా కాంగ్రెస్లో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతుంది.
రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లారు. రెండు రోజులు పాటు ఢిల్లీలోఉన్నారు. పలువురు బీజేపీ పెద్దలతో భేటీ అయినట్లు తెలిసింది. అయితే, మంగళవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పట్లో పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని పొంగులేటికి చెప్పినట్లు సమాచారం. కొద్దిరోజుల తరువాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగులేటి వద్ద ప్రస్తావించినట్లు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది.