2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేదని, మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాకూటమి విషయంపై రాహుల్ గాంధీ తనని పక్కకి పిలిచి మాట్లాడారని ఆయన తెలిపారు. వరిదీక్ష వేదికపై తాను, రేవంత్, ఉత్తమ్, వీహెచ్ ఏం మాట్లాడుకున్నారో అనే విషయాలతో పాటు దీక్షలో మొదటిరోజు బ్లాక్ షర్ట్, రెండవ రోజు వైట్ షర్ట్ వేసుకోవటానికి కారణమేంటో అనే ఆసక్తికర విషయాలని కోమటిరెడ్డి హ్యాష్ ట్యాగ్ ప్రతినిధి సిద్దార్థ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో తెలిపారు.
వరి దీక్ష కోసం కంకణం కట్టుకొని నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలు @revanth_anumula, @KomatireddyKVR, @UttamINC & మాజి ఎంపీ @vhrcongress
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి, ప్రతీ గింజ వరి కొనాలి. #VariDeeksha#JanJagranAbhiyan pic.twitter.com/0dnYTsJGqM
— Telangana Congress (@INCTelangana) November 27, 2021
రైతుల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్షకి బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చినట్లు కోమటిరెడ్డి తెలిపారు. వరిదీక్ష వేదికపై ముగ్గురు ఎంపీలు కలిసి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఏం మాట్లాడాలి అనే అంశాలను చర్చించడంతో పాటు తెలంగాణాలో జరుగుతున్న విషయాలను ప్రధానిని కలిసి వివరించే అంశంపై మాట్లాడుకున్నట్టు ఆయన తెలిపారు.
మహాకూటమి వద్దని తాను రాహుల్ కి చెప్పగా, పక్కకి పిలిచి నేషనల్ పార్టీ ఇంట్రెస్ట్ లో భాగంగా టీడీపీని కలుపుకుపోవాల్సిన ఆవశ్యకతను వివరించారని వెంకటరెడ్డి తెలిపారు. గాంధీ భవన్ మెట్లు ఎక్కాను అన్నాను కానీ గాంధీ భవన్ వెళ్తేనే పని చేసినట్టు కాదని ఎంపీగా ఎక్కడికైనా వెళ్తానని, ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ జెండా గూర్చే మాట్లాడుతానని అన్నారు. వరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, రైతులు పండించిన చివరిగింజ కొనేదాకా తమ పోరాటం ఆగదని ఆయన తెలిపారు.
పార్టీలో బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ శత్రువుతో కొట్లాడడానికి అందరం ఏకమవుతామని, తెలంగాణలో భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీదేనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.