Boy Kidnap : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురవడం కలకలం రేపింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్, తన 5 ఏళ్ల కుమారుడి శివసాయితో కలిసి తిరుమలకు వెళ్ళాడు. ఈనెల 28న (గురువారం) తెల్లవారుజామున 5.30 గంటలకు తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాడు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన దుర్గేశ్ అలసిపోయి ఉండటంతో స్టేషన్లోనే పడుకున్నాడు. సాయంత్రం 4.30కు దుర్గేశ్.. తన కుమారుడిని తీసుకొని ప్లాట్ ఫామ్ నెంబర్ 1 వద్ద ఉన్న వాష్రూం దగ్గరికి వెళ్లాడు. దుర్గేశ్ వాష్ రూంలోకి వెళ్లొచ్చేలోపు కుమారుడు శివసాయి కనిపించలేదు.
దీంతో రైల్వే స్టేషన్లో ఉన్న జీఆర్పీ పోలీసులకు దుర్గేశ్ ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా గుర్తు తెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. తప్పిపోయిన బాలుడు.. మూగ, చెవిటి అని తండ్రి దుర్గేశ్ చెబుతున్నాడు. హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఒంటరిగా కనిపిస్తున్న పిల్లలే టార్గెట్గా కిడ్నాప్ లకు తెగబడుతోంది. ఆ పిల్లల్ని యాచక వృత్తిలోకి (Boy Kidnap) దింపుతోంది. ఈ కిడ్నాప్ వెనుక కూడా బెగ్గింగ్ మాఫియా ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.