భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం నమూనా విడుదలైంది. ఈ ఏడాది 63 అడుగుల ‘శ్రీ దశమహా విద్యాగణపతి’గా రూపుదిద్దుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ హితం కోసం మట్టి గణపతినే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖైరతాబాద్లో గణేశ్ ఉత్సవాలు ప్రారంభమై ఈ ఏడాదితో 69 ఏళ్లు అవుతోంది. వినాయక చవితి దగ్గర పడుతున్నందన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిర్మాణంపై ఆసక్తి పెరుగుతోంది.
గత ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన గణపయ్య ఈ సారి శ్రీ దశమహా విద్యా గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వేగవంతం చేస్తోంది. 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన గణేశుడి చరిత్ర 68 అడుగుల ఎత్తు వరకు కొనసాగింది. గడిచిన చాలా సంవత్సరాల్లో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ పీవోపీ గణపతిని విభిన్న రూపాల్లో ప్రతిష్టిస్తూ వచ్చారు. గత రెండేండ్లుగా మాత్రం మట్టితో గణపతిని ప్రతిష్టించారు. ఈ సారి కూడా మట్టితోనే విగ్రహాన్ని తయారు చేయనున్నట్టు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఇప్పటికే కర్ర పూజలు మొదలైన విషయం తెలిసిందే.
Also Read: TTD: తిరుమలలో శ్రావణమాస సందడి.. ఈనెల 25న వరలక్ష్మి వ్రతం