Nominated Posts : ప్రస్తుతం రాష్ట్రంలో 50కిపైగా నామినేటెడ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఆరు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. వీటిని దశలవారీగా ప్రాధాన్యతల ఆధారంగా భర్తీ చేయనున్నారు. అయితే ఈ పదవుల ఆశావహులు ఎవరు ? గతంలో ఎవరికి ఎలాంటి హామీలు ఇచ్చారు ? ఏ ప్రాతిపదికన పదవులు ఇవ్వాలి ? అనే అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్లో భేటీ కానుంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యేలా ఈ పోస్టుల భర్తీ జరగాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని ఏయే పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం ఎంత ? నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏయే సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తే లోక్సభ పోల్స్లో పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది? అనే అంశాలపై ఫోకస్ చేయనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీకి సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో పార్టీ గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల సీనియర్ నేతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అసంతృప్తులను బుజ్జగించి కీలక నేతలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు నామినేటెడ్ పదవుల ఆశను చూపించారు. ఇప్పుడు ఆయా నేతలను సంతృప్తి పరచాల్సిన సమయం వచ్చింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీనియర్లకు పదవులు ఇవ్వకుంటే అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, అదే జరిగితే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఒకవేళ హామీ మేరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసినా(Nominated Posts).. పార్లమెంటు స్థానాల పరిధిలో సామాజిక సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు.