Site icon HashtagU Telugu

BRS Public Meeting In Paleru : తుమ్మల వల్లే ఖమ్మంలో ఒక్క సీటు రాలేదు – పాలేరు సభలో కేసీఆర్ విమర్శలు

Kcr Thummala

Kcr Thummala

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) ప్రచారం తో హోరెత్తుస్తుంది. గులాబీ బాస్ కేసీఆర్ గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వాద సభ పేరుతో జిల్లాలో సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో సభలు ఏర్పాటు చేయగా..ఈరోజు పాలేరు , మహబూబాబాద్ , వర్దన్న పేట సభల్లో పాల్గొన్నారు.

పాలేరు సభ (BRS Public Meeting In Paleru)లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఫై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తుమ్మ‌ల ఓడిపోయి మూల‌కు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశా అని , పాలేరు కు ఎమ్మెల్యే చేసి ఐదేండ్లు ఖ‌మ్మం జిల్లా మీద ఏక‌ఛ‌త్రాధిపత్యం ఇస్తే, ఒక్క సీటు రాకుండా చేశార‌ని నిప్పులు చెరిగారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళకు తగిన గుణపాఠం చెబుతారు అంటూ తుమ్మలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని కోరారు.

కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని విమర్శలు గుప్పించారు. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని… బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామని అన్నారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే పిలిచి ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇచ్చామన్నారు. ఇంత చేస్తే ఖమ్మంలో ఆయన పార్టీకి చేసింది గుండు సున్నా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పైగా తాను మోసం చేశానని ఆరోపిస్తున్నారు అని కేసీఆర్ సభ వేదిక ఫై మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

‘రాష్ట్రంలో పార్టీల వైఖరులను చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్‌ (Congress) నేతలు. మాజీ పీపీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉవాచ. రైతుబంధు (Rythu Bandhu) దుమారటన. రైతుబంధు వేస్ట్‌ అట. విలువైన ప్రజల పన్నులు కేసీఆర్‌ చెడగొడుతున్నడట. రైతుబంధు దుబారనా? రైతుబంధు ఉండాలా?’ అంటూ సీఎం కేసీఆర్‌ ప్రజలను ప్రశ్నించారు. ఇక పాలేరు ప్రజలకు ఉపేందర్ రెడ్డి ఉండడం అదృష్టమన్నారు. పాలేరులో ఆయనను గెలిపించండి అని కోరారు కేసీఆర్. ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే పాలేరు అంతటా దళితబంధు ఇస్తామని చెప్పారు. రేషన్ కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, దళిత బంధు నిలిచిపోతాయని అన్నారు కేసీఆర్.

తాను రైతుబంధు పథకానికి శ్రీకారం చుడితే ప్రముఖ వ్యవసాయవేత్త ఎంఎస్‌ స్వామినాథన్ ప్రశంసించారన్నారు. శభాష్‌ చంద్రశేఖర్‌.. బాగా చేశారంటూ కితాబిచ్చారని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతు బంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని యూఎన్‌ఓ కూడా భేష్‌ అన్నదని, తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని కితాబు ఇచ్చిందని అన్నారు.

Read Also : Amit Shah : బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం – అమిత్ షా ప్రకటన