KTR : మహారాష్ట్రలో రైతుల వరుస మరణాలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారక రామారావు (కేటీఆర్) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన,బీజేపీ పాలిత మహారాష్ట్రలో గత మూడు నెలల్లోనే 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం మనసు కలచివేస్తోందన్నారు. సగటున ప్రతి మూడు గంటలకు ఒక రైతు ప్రాణాలు విడవడం అనేది భారత వ్యవసాయ రంగంలోని తీవ్ర సంక్షోభానికి నిదర్శనమని చెప్పారు. రైతులు పండించే భూమి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఋణభారంతో కుదేలవుతున్న కుటుంబాలు దేశం గమనించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ విధానాన్ని వాస్తవికంగా అర్థం చేసుకునే ఓ సమగ్ర వ్యవస్థ అవసరమని అన్నారు. రైతు సంక్షేమానికి కేవలం హామీలతో కాదు, ప్రగతిశీల కార్యక్రమాలతో మాత్రమే మార్పు సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.
Read Also: PM Modi : అర్జెంటీనా పర్యటనకు ప్రధాని మోడీ..57 ఏళ్ల తర్వాత చారిత్రక పర్యటన
ఈ క్రమంలో కేటీఆర్ తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, పంటల బీమా పథకాలను ప్రస్తావించారు. ఈ విధానాలు రైతులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయని చెప్పారు. ఈ మాదిరిగా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉదాహరణగా పేర్కొన్న కేటీఆర్, అలాంటి ప్రాజెక్టులు నీటి లభ్యత పెంచి, సాగు భూములకు జీవం పోస్తాయని వివరించారు. పంటలకు గిట్టుబాటు ధరల కల్పన, ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ఆదాయం వచ్చే విధంగా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు.
రైతుల ఆత్మహత్యలు కేవలం ఒక రాష్ట్ర సమస్యగా కాకుండా, జాతీయ విపత్తుగా చూడాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. రైతు మనోబలాన్ని నిలబెట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి “కేసీఆర్ మోడల్” ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా కేంద్రం ముందుకు రావాలని సూచించారు. రైతుల సమస్యల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు చేస్తూ, దేశ భవిష్యత్తు కోసం రైతులను ఆదుకోవడం అత్యవసరమన్నారు. ఒకవేళ ఇలాగే కొనసాగితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని హెచ్చరించారు.
Read Also: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్.. టాప్-5లో టీమిండియా స్టార్ ప్లేయర్!