మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది. దీంతో రేపు చండూరులో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియో లీక్స్తో మైలేజ్ వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ అంశాన్ని బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. బీజేపీపై నిప్పులు చెరగనున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను బహిర్గతం చేసేందుకు కొన్ని అదనపు ఆడియో, వీడియో క్లిప్లను శనివారం విడుదల చేయనున్నట్లు పార్టీ అంతర్గత సమాచారం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చండూర్లో రేపు పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిఎం బహిరంగ సభలో ప్రసంగిస్తారని, తన ప్రసంగంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై ఆయన మాట్లాడతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బుధవారం మొయినాబాద్లోని ఫామ్హౌస్కు హాజరైన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఒకరైన రేగా కాంతారావు శుక్రవారం తెల్లవారుజామున తన ఫేస్బుక్ పేజీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్యెల్యేల కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తారని రాసుకొచ్చారు. అయితే సీఎం కెసిఆర్ శుక్రవారం ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించలేదు. దింతో రేపు చండూరులో సీఎం కేసీఆర్ సభలో ఎం మాట్లాడతారో అని అటు పార్టీ వర్గాలు, ఇటు ఇతర పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.