KCR Operation Akarsh: కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్.. ఉద్యమ నేతలకు గ్రీన్ సిగ్నల్!

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 02:59 PM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి వివిధ పార్టీల్లో చేరిన నేతలపై గురి పెట్టారు. గతంలో పార్టీని వీడిన నేతలందరినీ మళ్లీ చేర్చుకోవాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను ఆయన తన భుజస్కందాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలు పార్టీలు మారడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ ప్రారంభించింది. తనతో చేతులు కలపాల్సిందిగా కేసీఆర్ స్వయంగా పలువురు నేతలను ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

దాసోజు శ్రవణ్‌ గులాబీ పార్టీలో చేరడం ఖాయమై ఉండగా, స్వామిగౌడ్‌, జితేందర్‌రెడ్డి అధికార పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరినీ పార్టీలోకి ఆహ్వానించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆహ్వానంతో పాటు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నారు. జితేందర్‌తో కేసీఆర్ స్వయంగా చర్చలు జరపనుండగా స్వామిగౌడ్ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో కూడా చర్చలు జరుగుతున్నాయి.