Telangana: రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా సాగాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు సీఎం కేసీఆర్. నిర్మల్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ 2014 నుంచి రాష్ట్రం వేగంగా పురోగమిస్తోందని, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి మతపరమైన అలజడులు లేవని, కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష పార్టీలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి రైతులకు రైతుబంధు పథకాన్ని ఇస్తూ డబ్బుని వృథా ఖర్చుగా చూస్తున్నారని విమర్శించారు. ఇక వ్యవసాయ రంగానికి మూడు గంటల ఉచిత విద్యుత్ సరఫరా సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నాడని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు రైతు బంధుపై ఆసక్తి లేదు, వారికి 24 గంటల విద్యుత్ సరఫరా ఇష్టం లేదు. రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం ఇష్టం లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ రైతుల మధ్య దళారులు పుట్టుకొస్తారని, ఇది చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు కేసీఆర్.
ధరణి ఉండాలని, 24 గంటల కరెంట్ కావాలని రైతులు ఆకాంక్షిస్తున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.మా గవర్నమెంట్లో ఆదివాసీ గూడెలను, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం. అభివృద్ధి చేసుకుంటున్నారు. పోడు పట్టాలు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ అభివృద్ధి స్థిరంగా కొనసాగుతుంది. నేను జీవించి ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుందని పునరుద్ఘాటించారు సీఎం కేసీఆర్.
Also Read: KCR : మార్చి తర్వాత ఆసరా పెన్షన్ రు.5వేలు ఇస్తాం – కేసీఆర్ ప్రకటన