ED Vs Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ అభియోగాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసిన ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్).. ఆమెను ఢిల్లీకి తరలించింది. కవితను హైదరాబాద్లోని నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు.. అక్కడి నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు.. విమానాశ్రయం నుంచి ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు అధికారులు తరలించారు. శుక్రవారం రాత్రంతా కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు.ఈడీ ఆఫీసుకు తరలించేందుకు వేరే మార్గాన్ని అధికారులు ఎంచుకున్నారు. మీడియా కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుని ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఈడీ ఆఫీసుకు కవితను తీసుకెళ్లారు. ఈ సమయంలో ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు డాక్టర్ల బృందం ఈడీ కార్యాలయానికి చేరుకుని కవితకు వైద్య పరీక్షలు నిర్వహించింది. శనివారం ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ఏకకాలంలో ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం కవితను(ED Vs Kavitha) రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను విచారించేందుకుగానూ తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నారు. మరోవైపు తన అరెస్టును కోర్టులో ఛాలెంజ్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇక అంతకుముందు రోజు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఈడీ, ఐటీ అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు కవితను విచారించారు. సాయంత్రం 5:20 గంటలకు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కవితను ఈడీ కార్యాలయానికి తరలించారు.
ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడంపై కవిత ఘాటుగా స్పందించారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని, ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధైర్యపడొద్దని కుమారుడికి ధైర్యం చెప్పి ఆమె ఇంటి నుంచి ఈడీ అధికారులతో కారులో బయలుదేరారు. అరెస్ట్ అనంతరం పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం ప్రకారం ఎదుర్కొంటామని కవిత అన్నారు.