Site icon HashtagU Telugu

NTR Statue : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై వివాదం.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు..

Karate Kalyani sensational comments on NTR Statue in Khammam

Karate Kalyani sensational comments on NTR Statue in Khammam

ఎన్టీఆర్(NTR) శత జయంతి దినోత్సవాల సందర్భంగా గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 28 మే 2023న ఎన్టీఆర్ 100వ జయంతి కావడంతో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం(Telugu Desham) కార్యకర్తలు ఎన్టీఆర్ జయంతిని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఖమ్మంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. BRS నాయకుల ఆధ్వర్యంలో, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద కృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారు. ఎన్టీఆర్ కూడా ఈ కార్యక్రమానికి రానున్నాడు.

అయితే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ విగ్రహం వివాదంలో నిలిచింది. శ్రీ కృష్ణుని వేషధారణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహవిష్కరణను ఆపాలని నటి కరాటే కల్యాణి మీడియా ముందుకు వచ్చింది. భారత యాదవ సమితి తరపున శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని వ్యతిరేకిస్తు ఖమ్మం అడిషినల్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ కు కరాటే కళ్యాణి వినతిపత్రం అందచేసింది.

అనంతరం కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. దేవుని రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం మా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది. ఇది మత విద్వేషాలను రాజకీయం చేసి సమాజంలో అలజడులను సృష్టించే ప్రక్రియనే. దేవుని పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ విగ్రహావిష్కరణను నిలిపివేయాలి. రాజకీయ నేతను దేవుడి రూపంలో పెట్టడం కరెక్ట్ కాదు. అభిమాన నటుడైనా భగవంతుడి కంటే ఎక్కువ కాదు. అవసరమైతే కోర్టుకు వెళతాం అని అన్నారు.

 

Also Read :  Telangana: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు: కేటీఆర్