MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ గడువు మరోసారి పెరిగింది. తాజాగా ఈనెల 14 వరకు కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కవితకు రిమాండ్ను పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. వారం రోజుల్లో కవితపై ఛార్జిషీట్ను దాఖలు చేస్తామని ప్రకటించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ జడ్జి కావేరి బవేజా.. కవిత(MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు.
We’re now on WhatsApp. Click to Join
కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఛార్జిషీట్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన మే నెల 15వ తేదీలోగా ఛార్జిషీట్ను కోర్టుకు ఈడీ సమర్పించాల్సి ఉంది. అందుకే కవిత రిమాండ్ను స్పెషల్ జడ్జి మే 14 వరకు పొడిగించారు. నెల రోజుల విరామం తర్వాత కవితను తొలిసారిగా ఇవాళ నేరుగా కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఈసందర్భంగా జై తెలంగాణ.. జై భారత్ నినాదాలు చేసిన కవిత, దర్యాప్తు సంస్థలపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. సీబీఐ, ఈడీ అరెస్టుల అనంతరం కవితకు బెయిల్ ఇచ్చేందుకు స్పెషల్ కోర్టు నిరాకరించింది. దీంతో ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ అనివార్యమైంది.
మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది . గతంలో విధించిన కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ అధికారులు ఆయనను కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేజ్రీ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం కేజ్రీవాల్ కస్టడీని మే 20వ తేదీకి పొడిగిస్తూ తీర్పు చెప్పింది. మరోవైపు ఇదే కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తే.. అధికారిక విధులకు కేజ్రీవాల్ దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రస్తుతం దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది.