తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు మునుగోడు వైపే చూస్తున్నాయి. ఎలాగైనా ఈ ఉపఎన్నికలో విజయం సాధించాలని అధికార పార్టీతో సహా విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉపఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ ఇతర పార్టీల కంటే ఎక్కువగా ప్రచారంలోకి చొచ్చుకెళ్లుతోంది. అందులో భాగంగానే టాలీవుడ్ నుంచి ఈ మధ్యే బీజేపీలోకి చేరిన జీవిత రాజశేఖర్ ను ప్రచారంలోకి దింపేందుకు కమలదళం సిద్దమైనట్లు సమాచారం.
మునుగోడులో ప్రచారం చేయాలని జీవిత రాజశేఖర్ ను బీజేపీ నేతలు కోరారు. దానికి ఆమె ఒకే చెప్పినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో జీవిత రాజశేఖర్ మునుగోడులో ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భార్యతో కలిసి జీవిత రాజశేఖర్ ప్రచారంలో పాల్గొననున్నారు.