MLC Elections: మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకు జీవన్ రెడ్డి సై!

2023 అసెంబ్లీ ఎన్నికలో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఆయన ప్రత్యర్థి సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ కండువా కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.

Published By: HashtagU Telugu Desk
MLC Elections

MLC Elections

MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) హ‌డావుడి కాంగ్రెస్‌లో మొద‌లైంది. ఆశావాహుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన‌ మనసులోని మాట బయటకి చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలపైన‌ ఫోకస్ పెట్టిన నేప‌థ్యంలో అభ్యర్థుల ఎంపికలో వాడివేడి చర్చ జరుగుతుంది.

ఉత్తర తెలంగాణలో మరో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత ఇది ముఖ్యమైన ఎన్నికగా చెప్పుకోవచ్చు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి అదిలాబాద్‌, ఉమ్మడి ‌కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి ‌మెదక్ జిల్లాలకి విస్తరించి ఉంది. 2019 ఎమ్మెల్సీ ఎన్నికలలో జీవన్ రెడ్డి పోటీ చేసి విజయం సాగించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్‌ని ఎదుర్కొని కాంగ్రెస్ విజయం సాధించటంతో ఉత్తర తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ క్యాడర్‌లో నూతన ఉత్సహాం నింపారు.

2023 అసెంబ్లీ ఎన్నికలో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఆయన ప్రత్యర్థి సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ కండువా కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. బుజ్జగింపులు, ఫిరాయింపుల ఆరోపణలు కొన్ని రోజుల తరువాత సర్ధుకున్నాయి. ఇటీవ‌ల తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో మరోసారి అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. తరువాత ముఖ్యనేతలు‌ మాట్లాడిన కూడా వెనక్కి దగ్గలేదు. ఈ పరిణామాల కారణంగా జీవన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేయరని అందరూ భావించారు. కానీ మరోసారి ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

Also Read: One Year Of Congress Ruling : రైతన్న చరిత్రను తిరగరాసిన రోజు – సీఎం రేవంత్

వారం రోజుల నుండి కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా గాంధీభ‌వ‌న్‌లో సమావేశం నిర్వహించారు. అయితే ‌సిట్టింగ్ ఎమ్మెల్సీ ‌జీవన్ రెడ్డి జగిత్యాలలలో మీడియాతో‌ మాట్లాడారు. మరోసారి అవకాశం ‌ఇస్తే పోటీ చేస్తానని ఆయ‌న ప్రకటించారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ ‌కండువా కప్పుకున్నప్పటి నుండి అధిష్టానంపైనా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫిరాయింపుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య విషయంలో నేరుగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితులలో జీవన్ రెడ్డికి మరోసారి టికెట్ కెటాయింపులలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన అనుచరులకి‌ మాత్రం పోటీకి సిద్దం అంటూ చెబుతున్నారు. జీవన్ రెడ్డి టికెట్ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి!

  Last Updated: 30 Nov 2024, 12:48 PM IST