Jagadish Reddy: మాజీ మంత్రి జానారెడ్డి పై జగదీష్ రెడ్డి గరం గరం

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 08:03 PM IST

Jagadish Reddy: పుత్ర వాత్సాల్యంతో విపక్షం పై విమర్శలు చేస్తున్నారు సరే మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెలగ బెట్టింది ఏమిటో వివరించాలని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ని డిమాండ్ చేశారు. 35 సంవత్సరాలు శాసనసభ్యుడిగా 15 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా జిల్లాకు కలిగిన ప్రయోజనం శూన్యమే అన్నారు.అటువంటి మీరు పుత్రవాత్సల్యం కొద్దీ సూర్యాపేటకు వచ్చి సూర్యాపేటకు జగదీష్ రెడ్డి ఏమి చెయ్యలేదంటూ మీరు చేసిన ప్రకటన అందుకు కొనసాగింపుగా మరో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు మీ విజ్ఞతను బయట పెట్టినట్లయిందని ఆయన దుయ్యబట్టారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగ సూర్యాపేట కు వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 2014 కు పూర్వం ఇక్కడి ప్రజలు ఎటువంటి నీళ్లు తాగేదో,సాగు నీరందక సూర్యాపేట ,తుంగతుర్తి రైతాంగాం ఏ తీరుగా అల్లాడి పోయారో సుదీర్గ కాలంగా అదికారంలో ఉన్న మీకు తెలియక పోవచ్చు కానీ తెలంగాణా ఉద్యమ కారుడిగా నాకు బాగా తెలుసని ఆయన ఎద్దేవాచేశారు.చాలి చాలని విద్యుత్ తో అంది అందని నీటితో ఆత్మక్షోభను ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఏనాడైనా ఆదుకున్న చరిత్ర తమరికెక్కడదని ఆయన దుయ్యబట్టారు.

ఇక చందాల దందాల గురుంచి మాట్లాడాల్సి వస్తే మీరు వచ్చింది వైట్ హౌసో రెడ్ హౌసో మాకైతే తెలీదు కానీ అక్కడి నుండే కదా చందాల దందాలు సాగిందని ఆయన విరుచుకుపడ్డారు. అటువంటి ఇంటి నుండి మీ లాంటి వారు సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఇక్కడి ప్రజలెవ్వరు విశ్వసించరన్నారు.అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలోనే 2014 పూర్వ దుస్థితి ఉత్పన్నం కావడంతో సూర్యాపేటలో వర్తక వాణిజ్య వర్గాలు హడలెత్తి పోతున్నారన్నారు.చివరికి వైద్యులు మీ పార్టీ నేతల అఘాడలతో భయాందోళనకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు.