CM Revanth : ‘‘మీట్ ది ప్రెస్’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ గురించి కూడా రేవంత్ స్పందించారు. ‘‘ప్రవీణ్ కుమార్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఆయన ఐపీఎస్గా ఉద్యోగంలో ఉండి ఉంటే ఈపాటికి డీజీపీ అయ్యేవారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవిని ప్రవీణ్కు ఆఫర్ చేశాను.. కానీ ఆయన ఒప్పుకోలేదు. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో చేరుతారని నేను భావించడం లేదు. ఒకవేళ కేసీఆర్ తో చేరితే సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనే’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. హరీష్ రావు ఇంటిపేరులో తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు కాదని కామెంట్ చేశారు. ‘‘నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వ వైఖరి ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైంది.. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని సహించదని చరిత్ర చెబుతోంది. రాచరిక పోకడలతో వారసత్వాన్ని చలాయించాలని కేసీఆర్ ప్రయత్నించారు. ఖాసీం రిజ్వీలా తిరుగుబాటు చేసినవారిని కేసీఆర్ అణచివేసే ప్రయత్నం చేశారు’’ అని రేవంత్(CM Revanth) వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ ముళ్ల కంచెను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛను కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మేం అప్పుల గురించి మాట్లాడితే వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంపై రూ.9లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లు. కానీ ఇప్పుడు ఏడాదికి రూ.64 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారు. ప్రతీ ఏడాది రూ.70 వేల కోట్లు అప్పుల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి’’ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘తులసి వనంలో కొన్ని గంజాయి మొక్కలను నాటి వెళ్లారు. అవి దుర్గంధం వెదజల్లుతున్నాయి. అలాంటి గంజాయి మొక్కల్ని మొక్కలను ఒక్కొక్కటిగా పీకేస్తున్నాం. రోజుకు 18గంటలు పనిచేసి మొత్తం గంజాయి మొక్కల్ని పీకేస్తాం’’ అని సీఎం తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వంతో, గవర్నర్ తో సామరస్యపూర్వక విధానాలతో ముందుకెళుతున్నాం. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళుతున్నాం’’ అని ఆయన చెప్పారు. ‘‘జీరో బిల్లుతో పేదలకు ఉచిత కరెంటు అందిస్తుంటే.. కొంతమంది అడ్డు తగులుతున్నారు. వాళ్ల అడ్డు తొలగించి పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేసి తీరుతాం’’ అని సీఎం స్పష్టం చేశారు.
‘‘బతుకమ్మను కొందరు వ్యాపార వస్తువుగా, ఆటవస్తువుగా మార్చారు. బతుకమ్మ, బోనాలు అనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలు. ఎవరున్నా లేకున్నా బతుకమ్మ, బోనాల పండుగలు జరుగుతాయి. ప్రైవేట్ చేతిలో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థకు అప్పగించాం. ధరణి పోర్టల్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే తప్ప అసలు విషయం బయటపడదు.తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదు. కొండలు.. గుట్టలు.. లే అవుట్ లకు రైతు భరోసా ఇవ్వబోం.నిధుల దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకుంటాం’’ అని రేవంత్ వెల్లడించారు.