Hydra Report : అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో హైదరాబాద్లో పెను సంచలనంగా మారిన ‘హైడ్రా’ విభాగం కీలక నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. అందులో కొన్ని ముఖ్యమైన వివరాలను ప్రస్తావించింది. ఇప్పటివరకు హైదరాబాద్ మహా నగరం పరిధిలో 18 చోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిపామని వెల్లడించింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
గత 20 రోజుల వ్యవధిలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, నటుడు అక్కినేని నాగార్జున, బీజేపీ నేత సునీల్రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా బేగ్లకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చేశామని నివేదికలో హైడ్రా వెల్లడించింది. హైదరాబాద్లోని మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్లలోని ఆయా అక్రమ నిర్మాణాలను తొలగించామని తెలిపింది. నగరంలోని లోటస్పాండ్, మన్సూరాబాద్ సహార్ ఎస్టేట్లో పలు నిర్మాణాలతో పాటు బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్, బోడుపల్ల్, గండిపేట చెరువు వద్దనున్న పలు నిర్మాణాలను కూల్చామని నివేదికలో హైడ్రా పేర్కొంది.నందినగర్లో ఎకరం స్థలాన్ని కబ్జాకోరుల చెర నుంచి కాపాడినట్లు చెప్పింది. లోటస్ పాండ్ పార్క్ కంపౌడ్ వాల్ కూల్చేసినట్లు హైడ్రా వెల్లడించింది. మిథాలీ నగర్లో పార్క్ స్థలాన్ని కాపాడినట్లు తెలిపింది. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్కుల స్థలాలను కబ్జా చేయగా, తాము స్వాధీనం చేసుకున్నామని హైడ్రా స్పష్టం చేసింది. ఇప్పటిదాకా 43 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. అక్రమ నిర్మాణాలు కలిగిన మరికొందరికి ఇప్పటికే నోటీసులు పంపామని హైడ్రా(Hydra Report) అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఆయా నిర్మాణాల యజమానులు కోర్టులను ఆశ్రయించినట్లు సమాచారం.
Also Read :Vem Narender Reddy : ‘‘నా పేరుతో వసూళ్లు చేసే వాళ్లను నమ్మకండి’’.. వేం నరేందర్ రెడ్డి ప్రకటన
ఈనేపథ్యంలో తెలంగాణలోని అన్ని నగరాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని అంటున్నారు. ఆ వ్యవస్థ ద్వారా ఆక్రమణలను తొలగించడం, కొత్తగా కబ్జాలు కాకుండా ప్రభుత్వ స్థలాలను కాపాడే చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఎక్కడ చెరువుల ఆక్రమణలు జరిగినట్టు గుర్తించినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలంటూ శనివారం రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. త్వరలోనే మన రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ ‘హైడ్రా’ తరహా వ్యవస్థల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.